యాదగిరిగుట్ట : తొలి ఏకాదశి సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తిరుమాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాలవద్ద భక్తులతో కొలాహాలం కనిపించింది.
తొలి ఏకాదశిని పురస్కరించుకొని గురువారం లక్ష పుష్పార్చన శాస్త్రోకంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన, స్వాతి నక్షత్ర పూజలు చేశారు. స్వామివారిని సుమారు 40వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.49,19,117 ఆదాయం(Income) సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర మహిళా కమిషన్(Women Commission) చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జాతీయ సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తురక నరసింహ, ఢిల్లీకి చెందిన అదనపు డీజీపీలు రాజేశ్ ఖురానా, గరిమ భట్నాగర్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.