యాదాద్రి, సెప్టెంబర్ 4: యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు, పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో, స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని 30 వేల మంది భక్తులు దర్శించుకోగా.. అన్ని విభాగాలు కలుపుకొని ఖజానాకు రూ.32,24,793 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.