హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పించే ‘మన ఊరు-మనబడి’ మొదటిదశ పనులు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా సాగుతున్నాయి. సివిల్ వర్క్స్, భవన, టాయిలెట్ల మరమ్మతులు, విద్యుదీకరణ తదితర నిర్మాణాలు పూర్తికాగా, తాజాగా పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మండలానికి 2 పాఠశాలల చొప్పున రాష్ట్రంలో 1300 పైచిలుకు మాడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పథకం తొలి విడతలో 9,123 పాఠశాలలు ఉండగా, ఇందులో 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలకు మరమ్మతులు చేపడుతున్నారు. 100 మందికిపైగా విద్యార్థులున్న బడుల్లో 12 అంశాలు తీసుకొని స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. పెయింటింగ్స్, డ్యూయల్ డెస్క్ బల్లలు, ఫర్నిచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డులను రాష్ట్రస్థాయిలో బల్క్గా సేకరించనుండగా, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఇటీవల రంగులను స్కూళ్లకు చేర్చారు.
‘మన ఊరు-మనబడి’లో ప్రధాన కార్యక్రమం గోడలకు రంగులు వేయడం. రాష్ట్రవ్యాప్తంగా 1,39,585 తరగతి గదులుండగా, తొలివిడత 71,115 గదులకు రంగులు వేయాలని నిర్ణయించారు. తరగతి గది లోపల, వెలుపల, భవనం, టాయిలెట్లు..ఇలా ఆవరణ మొత్తం రంగులు వేస్తారు. ఆ తర్వాత అందమైన చిత్రాలు, పాఠ్యాంశ సంబంధ చిత్రాలు, చారిత్రక కట్టడ రూపాలు, గ్రామీణ జీవనం ప్రతిబింబించే చిత్రాలను గోడలపై వేయనున్నారు. ఈ రంగులు 7 ఏండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ప్రణాళిక
రూపొందించారు.