హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పను ల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా 15.84 కోట్ల పనిదినాలు కల్పించింది. రాష్ట్రంలో ప్రతి రోజూ సగటున 5 లక్షల మంది పనిచేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల పనిదినాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు, పల్లెప్రగతి పనులతో ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం పని కల్పించింది. కరోనా సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేకమంది గ్రామాలకు వలసవెళ్లారు. వారిందరూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేయడానికి ముందుకొచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన పనులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 12 కోట్లకు అదనంగా పనిదినాలను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో పెద్దఎత్తున పని దినాలు పెరిగాయి. నిధులను విడుదల చేయడంలో కేంద్రప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నా.. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తున్నది. నిధుల్లో 60 శాతం కూలీల వేతనాలకు పోగా మిగిలిన మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు అయింది. 12,775 గ్రామ పంచాయతీల్లో 21,503 అవాసాల్లో ఉపాధి హామీ పనులు చేశారు. రాష్ట్రంలోని 3.23 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలను కల్పించారు. మొత్తం 54 లక్షల జాబ్ కార్డులను జారీచేయగా.. కార్డు పొందిన ప్రతిఒక్కరికీ సగటున 50 రోజుల పనిదినాలను కల్పించారు. ఉపాధి హామీలో బీసీలు 51 శాతం, ఎస్టీలు 20 శాతం, ఎస్సీలు 23 శాతం పనిపొందారు. ఒక్కొక్కరికి సగటున రోజుకు రూ.170 కూలి అందింది.