యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న సత్సంకల్పంతో సీఎం కేసీఆర్ రూపొందించిన దళితబంధు పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశానికే ఆదర్శంగా నిలువనున్న ఈ పథకంపై అధ్యయనం చేసి పుస్తక రూపంలో తీసుకురావాలని మేధావి వర్గం సంకల్పించింది. ఈ మేరకు పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మాజీ ప్రొఫెసర్లు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ నేతృత్వంలో క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. దళితబంధును లాంఛనంగా ప్రారంభించిన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. గౌరీశంకర్తోపాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జే దేవీప్రసాద్, ఎస్ఆర్టీఐ డైరెక్టర్ కిశోర్, స్వామి రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్రెడ్డి, ప్రముఖ చరిత్రకారుడు అడప సత్యనారాయణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అంజిరెడ్డితో కూడిన 16 మంది సభ్యుల బృందం ఆదివారం వాసాలమర్రిలోని దళిత వాడల్లో పర్యటించింది.
ప్రతి ఇంటికీ వెళ్లి..
దళితబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు రూ.9.90 లక్షల చొప్పున ఇచ్చింది. ఈ సొమ్మును వారి ఖాతాల్లోనే జమ చేసింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల బృందం వాసాలమర్రి దళితవాడలోని ప్రతి ఇంటికీ వెళ్లి అధ్యయనం చేసింది. మూడు బృందాలుగా ఏర్పడి ఆయా కుటుంబీకులతో మాట్లాడింది. దళిత బంధు పథకం కింద ఇస్తున్న పది లక్షల డబ్బుతో ఏం చేస్తారని ప్రొఫెసర్లు అడిగి తెలుసుకున్నారు. కొందరు డెయిరీ ఫారం పెట్టుకుంటామని, మరికొందరు ఆటోలు కొనుక్కుంటామని చెప్పారు. బోర్లు వేసుకుని పంటలు, కూరగాయలు పండించుకోవడం ద్వారా ఉపాధిని మెరుగుపర్చుకుంటామని మరికొందరు తెలిపారు. వారాంతా ఆయా వృత్తుల్లో ఎంతో అనుభవం ఉన్నవారిలా చెప్తుంటే ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. గుణాత్మక మార్పు దిశగా ఇక్కడి దళితుల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి అబ్బురపడ్డారు. వారిని వెన్నుతట్టి అభినందించారు. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో అమలు చేస్తున్నప్పటికీ తొలుత ఈ పథకానికి అంకురార్పణ జరిగింది వాసాలమర్రిలోనే. ఇక్కడ సాధించిన విజయం దేశంలోని ఇతర ప్రాంతాల దళిత సంక్షేమానికి దిక్సూచిగా నిలుస్తుందని ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలతోపాటు నిజాం కాలేజీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్తో కూడిన ఈ అధ్యయన బృందానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక సంస్థల సిబ్బంది సహకారం అందించారు.
‘ఇండియన్ విలేజ్’ పుస్తకమే స్ఫూర్తి: జూలూరు
హైదరాబాద్ చెంతనే ఉన్న శామీర్పేట్ గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసిన వైనంపై 1951లో రచయిత దూబే రాసిన ‘ఇండియన్ విలేజ్’ అప్పట్లో చారిత్రక పుస్తకంగా నిలిచిందని జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. ఆ స్ఫూర్తితోనే వాసాలమర్రి దళిత కుటుంబాల్లో వచ్చిన చైతన్యంపై పుస్తకాన్ని తీసుకురావాలని సంకల్పించినట్లు చెప్పారు. వాసాలమర్రి పునాదిగా దళిత కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చిన అంశాలను భావితరాలకు అందించేందుకే పుస్తకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘సంపద పెంచండి- సంపద పంచండి’ అన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దళితబంధు విజయం సాధించి తీరుతుందన్నారు. తద్వారా యావత్ దేశానికే ఆచరణయోగ్యమైన పథకంగా, భావి భారత పౌరులకు పాఠ్యాంశంగా వర్థిల్లుతుందని చెప్పారు. తమ అధ్యయన నివేదికలను త్వరలో సీఎం కేసీఆర్కు అందజేయనున్నట్టు తెలిపారు.