నారాయణపేట : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని రాష్ట శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగారం చౌరాస్తా సమీపంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉన్న మహిళలలోని నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించి వెలిక్కి తీయడానికి, వారి జీవనోపాధుల పెంపునకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ఆయన కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇచ్చే శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని మండలి డిప్యూటీ చైర్మన్ మహిళలకు సూచించారు.
గత ఏడాది కొవిడ్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు మాస్కులు తయారు చేసి వాటిని విక్రయించి నారాయణపేట కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని కలెక్టర్ హరిచందన తెలిపారు. మాస్కులు అమ్మగా వచ్చిన లాభం తోనే ప్రస్తుతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మించినట్లు మండలి వైస్ చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, నారాయణపేట, మక్తల్ శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో వెంకటేశ్వర్లు, నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.