హైదరాబాద్: మ్యాట్రిమోనీ (Matrimony) సైట్లో పరిచయమైన ఒక మహిళ.. మన పరిచయానికి గుర్తుగా లండన్ (London) నుంచి గిఫ్ట్ పంపిస్తున్నానంటూ నమ్మించి ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.26.95 లక్షలు టోకరా వేసింది. నాగోల్ (Nagole), జయపురికాలనీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి (Government Employee) భారత్ మ్యాట్రిమోనీ (Bharat matrimony) ద్వారా అనితా జోసెఫ్ పేరుతో ఒక మహిళ పరిచయమైంది. గుర్తుతెలియని నంబర్తో వాట్సాప్ చేసి, నేను అనితా జోసెఫ్నంటూ ఆమె పరిచయం చేసుకుంది. తాను యూకేలో ఉంటూ వైద్యురాలిగా పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎలాగో కాబోయే దంపతులం, లండన్ నుంచి నీకోసం నేను గిఫ్ట్ పంపిస్తున్నానంటూ చెప్పింది.
మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్పోర్టు (Delhi Airport) నుంచి కస్టమ్స్ (Customs) అధికారులం మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది. మీ పేరుతో వచ్చిన పార్శిల్లో బంగారు గొలుసులు, కరెన్సీ, ఇతర ఆభరణాలు ఉన్నాయంటూ చెప్పారు. ఈ పార్శిల్కు కస్టమ్స్ క్లియరెన్స్ లేదని, డబ్బు చెల్లించి వస్తువులు తీసుకోవాలంటూ సూచించారు. నిజమని నమ్మిన బాధితుడు వారు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత వివిధ కారణాలు చూపిస్తూ దఫదఫాలుగా రూ.26,95,765 వసూలు చేశారు. మరింత డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు.. రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.