హైదరాబాద్ : మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఏప్రిల్లో సీఎం కేసీఆర్ ప్రకటించగా కేవలం ఐదు నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 20,899 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టులను భర్తీ చేసేందుకు 23 ఖాళీలతో నోటిఫికేషన్ వెలువడింది.
ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది.