పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆర్నెల్లకో పార్టీ మారే రేవంత్.. బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా మారారని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. రాళ్లతో కొడితే చెప్పులతో బదులిస్తామని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేదిలేదని స్పష్టంచేశారు. తాము కాంగ్రెస్ పార్టీని చట్టబద్ధంగానే టీఆర్ఎస్లో విలీనం చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాళ్లతో కొడితే చెప్పులతో బదులిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. తాము కాంగ్రెస్ పార్టీని చట్టబద్ధంగా టీఆర్ఎస్లో విలీనం చేశామని స్పష్టంచేశారు. రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడని నిప్పులు చెరిగారు. ఆర్నెల్లకో పార్టీ మారే రేవంత్.. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోతే పార్టీ మారేవాడని విమర్శించారు. తమ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదని తేల్చిచెప్పారు. ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టండని రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆక్షేపించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్వి దొంగ రాజకీయాలని, తమవి ప్రజా రాజకీయాలని స్పష్టంచేశారు. ఇంట్లో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ముఠాగా ఏర్పాటుచేసి సమాచార హక్కు చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బ్లాక్మెయిల్కు పాల్పడుతూ రూ.కోట్లు దండుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్కు రూ.25 కోట్లు ముట్టజెప్పి పీసీసీ పదవిని దొడ్డిదారిన తెచ్చుకున్నాడని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ తెచ్చిన చట్టం ప్రకారమే తాము పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశామని వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. చిలుక పలుకులు పలుకుతున్నాడని మండిపడ్డారు. 130 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ అనేక పార్టీలను తనలో విలీనం చేసుకున్నదని, అలా కొట్టాల్సి వస్తే ముందు కాంగ్రెస్నే రాళ్లతో కొట్టాలన్నారు. రాజస్థాన్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్న అశోక్ గెహ్లాట్ను, 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన దిగ్విజయ్సింగ్ను ముందు రాళ్లతో కొట్టాలని చెప్పారు. తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్ధంగానే టీఆర్ఎస్లో చేరినట్టు అప్పట్లోనే ప్రకటించామని గుర్తుచేశారు. గుంజుకుంటే అధికారం రాదని, ప్రజలిస్తేనే వస్తుందనే కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో చేతులు కలిపి ప్రత్యేక రాష్ట్రం రాకుండా గండి కొట్టాలని చూసింది నువ్వుకాదా అని నిలదీశారు. రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్నే నాశనం చేయడానికి, జన్మనిచ్చిన తెలంగాణను స్థిరత్వం లేకుండా చేయడానికి రేవంత్.. ద్రోహులకు అమ్ముడుపోయాడని మండిపడ్డారు. రాష్ర్టాన్ని నాశనం చేయాలనే ఓటుకు నోటు కేసులో డబ్బు ఎరజూపి అడ్డంగా దొరికిపోయాడని విమర్శించారు.
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు..: ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవి రాగానే రేవంత్కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పేర్కొన్నారు. పదవులకు గౌరవాన్నిచ్చేలా ఉన్నత విలువలు పాటించాలని ఎవరైనా చూస్తారు కానీ, రేవంత్ మాత్రం వాటిని దిగజార్చేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనవుతారని పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటికైనా లంగా.. లుచ్చా మాటలు మానుకోవాలని హితవుపలికారు. తామంతా టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేశామని ఏడాదిన్నర కిందటే చెప్పినట్టు గుర్తుచేశారు. రాళ్లతో కొట్టాలంటే ఆర్నెల్లకో పార్టీ మారిన రేవంత్నే ముందు కొట్టాలని పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న రేవంత్రెడ్డి చట్టవ్యతిరేక భాషను వాడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ‘దేహశుద్ధిచేస్తాం, శిక్షిస్తాం, కొట్టి చంపండి’ అంటూ ప్రజల్ని రెచ్చగొడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పార్టీలు, సంస్థలు నిషేధిత జాబితాలో ఉంటాయని.. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నిషేధించాలా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం ఎన్నికైన సభ్యుల్లో 2/3వ వంతు మంది తాము ఎన్నికైన పార్టీ నుంచి బయటికి వచ్చి వారి ఇష్టమున్న పార్టీలో చేరవచ్చన్న నిబంధనను రాజీవ్గాంధే తెచ్చారన్న సంగతిని కూడా మరిచిపోయి.. రేవంత్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నుంచి గెలిచి రాజీనామా పత్రాన్ని స్పీకర్కు కాకుండా చంద్రబాబుకు పంపి పూర్తికాలం పదవిలో ఉన్న రేవంత్ వంటి వాడు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన నిలదీశారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ కాంగ్రెస్లో చేరి అందరినీ పక్కనపెట్టి పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ ఎలా సొంతం చేసుకున్నాడో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ‘రేవంత్.. నువ్వు పార్టీలు మారితే సంసారం.. ఇతరులు మారితే వ్యభిచారమా?’ అని ఘాటుగా స్పందించారు. పార్టీలు మారటం దేశంలో కొత్తేమీకాదని, తాము చట్టబద్ధంగానే పార్టీని విలీనం చేశామని పునరుద్ఘాటించారు. రేవంత్ రాజకీయ జీవితమంతా వివాదాస్పమేనని విమర్శించారు. రాజకీయాల్లో పరుషపదజాలంతో రాణించలేరని, రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన తెచ్చుకొని మాట్లాడాలని హితవుపలికారు. దిగజారి మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు.