Telangana | ‘సమస్య ఉన్న చోటే సాహిత్యం పుడుతుంది. అణచివేత ఉన్న చోటే అగ్గి రాజుకుంటుంది. పీడన ఉంటేనే పోరు పుడుతుంది. అనాదిగా అవనిపై జరుగుతున్నది ఇదే. పోతన, వేమన నుంచి మొదలుకొని కారల్మార్క్స్ వరకు గొప్ప రచయితలు, కవుల సాహిత్యం అజరామరంగా నిలిచింది అంటే.. వారు ఎంచుకున్న సాహిత్య కథావస్తువే దానికి కారణం. అయితే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కథా వస్తువులు కరువయ్యాయి’ అంటున్నారు ప్రముఖ కథా, నవలా రచయిత, ఉపాధ్యాయుడు, జగిత్యాల వాసి కేవీ నరేందర్. అప్పటి సంక్షోభ తెలంగాణ.. సొంత రాష్ట్రంలో సంక్షేమ తెలంగాణగా మారిందని చెబుతున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కవులు, రచయితల సంఖ్య తగ్గిపోవడానికి కారణమేంటి?
‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అని గరిమెల్ల అన్నా.. ‘తీగలను తెంచి అగ్గిలోన దించినావు’ అంటూ దాశరథి నినదించినా.. ‘బండెనక బండి కట్టి’ అంటూ యాదగిరి గొంతెత్తినా ప్రజా సమస్యలను మూలవస్తువుగా చేసుకొనే. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి వెతలు, బొగ్గుబాయి కష్టాలు, కరెంట్ కోతలు, పూడిపోయిన చెరువులు, బావులు, పట్టెడన్నం కోసం సాగించిన పోరాటం.. వారి త్యాగం తదితర అంశాలన్నీ సాహిత్యానికి కథా వస్తువులుగా స్వీకరించేవారం. అయితే స్వరాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. అందుకే రచయితలకు బలమైన కథావస్తువులు దొరకడం లేదు.
అప్పటి, ఇప్పటి తెలంగాణకు తేడా ఏంటి?
ఉమ్మడి పాలకులు తెలంగాణను అంతర్గత వలస ప్రాంతంగా భావించారు. వనరులను కొల్లగొట్టారు. సంస్కృతిని అవమానించారు. మాండలికాన్ని తుర్కాం ధ్రం అంటూ తక్కువ చేశారు. అప్పటి సంక్షోభ తెలంగాణ.. స్వరాష్ట్రం వచ్చాక సంక్షేమ తెలంగాణగా మారింది. ఈ పదేండ్లలో దోపిడీ లేదు. పీడన లేదు. ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది.
ఒక కథా రచయితగా ప్రస్తుత తెలంగాణ ఎలా కనిపిస్తున్నది?
పదేండ్ల తెలంగాణను చూసి సంబురం అయితుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదర్శ తెలంగాణగా అవతరిస్తున్నాం. సీఎం కేసీఆర్ పాలనలో కవులు, కథా రచయితలకు సాహిత్య వస్తువు దొరకడం లేదు. సమస్య ఉంటేనే కదా సాహిత్యం పుట్టేది. తెలంగాణ రాకముందు రైతు ఆత్మహత్యలు ఉండేవి. ఆ నేపథ్యంలో సాహిత్యం వచ్చింది. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో అన్నదాతల జీవితాలు పచ్చటి పొలాలుగా మారిపోయాయి. చేనేత కార్మికులు బంగారం, వెండితో చీరలు నేస్తున్నారు. కరెంటు కష్టాలు రాద్దామంటే.. తీగలను కాదు కదా, ఆ సబ్జెక్టుని ముట్టుకుంటేనే షాక్ తగిలేంతగా కరెంటు ఉంటున్నది. ఎకడో ఒక చోట, ఎవరో ఒకరికి అన్యాయం జరగొచ్చు. కోట్ల రూపాయల పథకంలో వంద రూపాయల నష్టం జరిగిందని గగ్గోలు పెట్టడం సరికాదు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయం?
రాజకీయం అంటే సంక్షేమం ఒక్కటే కాదు.. అభివృద్ధితో పాటు, అనేక అంశాల కలబోత. నేటి రాజకీయ నేతలకు వ్యక్తిగత స్వార్థం తప్ప.. ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు. ఇటు నుంచి అటు గెంతే కప్పల్లాగా పార్టీలు మారుతున్నవారు అధికమయ్యారు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారుతున్నాడంటే.. వ్యక్తిగత లాభం కోసమా? లేదా ప్రజా సంక్షేమం కోసమా? అనేది ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి.
ఓటు విలువ గురించి ఏం చెబుతారు?
ఓటు పవిత్రమైనది. యాభై ఏండ్ల క్రితం ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, ఓటు వేయకపోయినా అవమానంగా భావించేవారు. ఒకరకంగా చనిపోయినట్టు అనుకునేవారు. ప్రస్తుతం అక్షరాస్యులు, మేధావులు, ఉద్యోగులు, సినిమా యాక్టర్లు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది అత్యంత బాధాకరం.
నేటి నాయకుల గురించి ఏమనుకుంటున్నారు.?
రాజకీయ నాయకుడంటే సీఎం కేసీఆర్లాగా ఉండాలి. దీనికి నా వ్యక్తిగత అంశమే ఉదాహరణ. 2016లో నాకు పారిన్సన్ వ్యాధికి సంబంధించి ఆపరేషన్ జరిగింది. రూ.14 లక్షలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో నేనూ పాల్గొన్నా. కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ విషయం తెలుసుకొని వెంటనే రూ.15 లక్షల చెక్ ఇచ్చారు. ‘మాకు ఒక నాయకుడు ఉన్నాడు’ అని రచయితలందరికీ అప్పుడు ధైర్యం వచ్చింది.
…?మహేశ్ కుమార్ కొత్తూరి