హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ కౌన్సెలింగ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో కౌన్సెలింగ్ తీవ్ర జాప్యం అవుతున్నది. డిసెంబర్ సగం గడిచినా కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవటంతో విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. డీఈఈసెట్ ఎగ్జామ్ను జూన్ 1న నిర్వహించారు. జూన్ 8న ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయించాల్సి ఉండగా, జూన్ నుంచి ఇంత వరకు కౌన్సెలింగ్ను చేపట్టలేదు. డీఈఈసెట్లో క్వాలిఫై అయినవారంతా కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? సీట్లు ఎప్పుడు కేటాయిస్తారా? అని వేచిచూస్తున్నారు. డీఎడ్ కాలేజీలకు ఎస్సీఈఆర్టీ అధికారులు గుర్తింపును జారీచేసి, ఆయా కాలేజీలు సీట్ల వివరాలను డీఈఈసెట్ కన్వీనర్కు అప్పగిస్తారు. ఈ వివరాలతో మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తిచేయలేదు. దీంతోనే ఈ కౌన్సెలింగ్ ఆలస్యమవుతున్నది. ఇప్పటికిప్పుడు సీట్లు భర్తీ చేసినా, విద్యాసంవత్సరం సజావుగా కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు. ఒక వేళ కౌన్సెలింగ్ చేపట్టినా, వేసవిలో క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని కాలేజీల నిర్వాహకులు చెప్తున్నారు.