Cherlapally Terminal | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో టర్మినల్ పనులు మూడేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. గత డిసెంబర్ నాటికే టర్మినల్ పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటిదాకా 70-80 శాతం పనులే పూర్తయినట్టు తెలుస్తున్నది.
ఈ నెల 4, 5 తేదీల్లో నగరంలో పర్యటించిన ప్రధాని మోదీ.. సనత్నగర్-మౌలాలి విద్యుద్దీకరణ పనులు, లింగంపల్లి-ఘట్కేసర్ ఎంఎంటీఎస్ నూతన సర్వీసులను ప్రారంభించారు. చర్లపల్లి టర్మినల్ పనులు పూర్తి కాకపోవటంతోనే దాన్ని ప్రారంభించేందుకు ఆయన ఆసక్తి చూపలేదని తెలిసింది. టర్మినల్ను ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ స్వయంగా ప్రకటించారు.
కానీ, ఫలితం లేదు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రైళ్ల రాకపోకల వల్ల పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టర్మినల్ను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణానికి బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. కాజీపేట, నల్లగొండ రైల్వేమార్గాల నుంచి వచ్చే రైళ్లను చర్లపల్లి టెర్మినల్లో నిలిపి, అక్కడి నుంచే వెనక్కి పంపిస్తారు. దీంతో ప్రధాన రైల్వేస్టేషన్లలో రద్దీకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే, చర్లపల్లి టర్మినల్ నుంచి నగరంలోకి రవాణా అనుసంధానంపై మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. టర్మినల్ ప్రారంభానికి ముందే అక్కడ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు ఇతర రవాణా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేకపోవటం గమనార్హం.