నందికొండ, ఏప్రిల్ 8 : ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ ఎన్నెస్పీ అధికారులు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణా యాజమాన్య బోర్డు ఈఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాల్వ 5, 7 తూము గేట్ల నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని ఎన్నెస్పీ ఈఈ శ్రీహరి విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం 10 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్లోకి ఈ ఏడాది వరద నీరు రాకపోయినా.. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా ఏపీవాళ్లు ఇప్పటి వరకు 18 టీఎంసీల నీటిని వాడుకున్నారు. ఇప్పుడు మరో 5 టీఎంసీల నీటిని వాడుకునేందుకు విడుదల చేశారు. దీంతో మొత్తంగా కుడి కాల్వ ద్వారా 23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లవుతుంది. అయితే.. తెలంగాణకు ఎడమ కాల్వ ద్వారా కృష్ణా జిల్లాకు విడుదల చేసిన 2 టీఎంసీల నీటిని కలుపుకొని ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నాగార్జుసాగర్ డ్యామ్ ప్రస్తుత నీటి మట్టం 511.20 అడుగుల వద్ద 133.7164 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రిజర్వాయర్లో నీటి మట్టం 510 అడుగులకు దిగువకు చేరితే డేడ్ స్టోరేజీకి చేరినట్టు. ప్రాజెక్టులో నీటి మట్టం బాగా తగ్గిపోతుండటం, ఇంకా వానకాలం సీజన్ రావడానికి 4 నెలల గడువు ఉండటంతో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కోనున్నట్టు నిపుణులు చెప్తున్నారు.