హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీఎం ప్రణామ్ పథకాన్ని ఉపసంహరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలు రైతు సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ జంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అన్ని రాష్ర్టాలు ఆమోదిస్తేనే పీఎం ప్రణామ్ బిల్లును పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశ జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నదని, పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ‘దేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాం. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికీ 9 కోట్ల ఎకరాలు బీడుగానే ఉన్నది. జనాభాకు సరిపడా ఆహారధాన్యాలు పండించాలంటే రసాయన ఎరువుల వాడకం తప్పదని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐఎకేఎస్ నేత సారంపల్లి మల్లారెడ్డి, సీఐటీయూ నేత పాలడుగు భాసర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆర్ వెంకట్రాములు, గిరిజన సంఘం నేత ఆర్ శ్రీరామ్ నాయక్, కేవీపీఎస్ నేత సై లాబ్ బాబు, రజక వృత్తిదారుల సంఘం నేత పైళ్ల ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం నేత లెల్లెల బాలకృష్ణ, డీవైఎఫ్ఐ నేత కోట రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం నేత బుర్రి ప్రసా ద్, తెలంగాణ రైతు సంఘం నేతలు మూడ్ శోభన్, టీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.