KTR | రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా ఆదివారం జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలిరావాలని సూచించారు.
పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో సభకు హాజరయ్యే వారంతా గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని తెలిపారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని సూచించారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని చెప్పారు.
సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సభకు చేరుకునే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి చోట మంచినీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో కేసీఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.