Kadiyam Kavya | వరంగల్, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం హనుమకొండలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లా బిడ్డగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట ప్రజలకు సేవ చేశానని చెప్పారు.
కడియం శ్రీహరి దళితులను అణచివేశారని, ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యాయని ఆరోపించారు. తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఆయన మంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తానోనన్న భయంతో తన ఓటమికి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు దక్కకుండా చేశారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కుతంత్రాలు చేశారని దుయ్యబట్టారు. ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. ఇప్పుడు వరంగల్ ప్రజలు.. గుంటూరు కోడలు కావ్య నజీరుద్దీన్ కావాలో.. వరంగల్ బిడ్డ అరూరి రమేశ్ కావాలో ఆలోచించాలని కోరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.