వేములవాడ: పాస్పోర్ట్ సమస్యల కారణంగా బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్యను స్వదేశానికి రప్పించేందుకు కృషిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయమై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ( MLA Adi Srinivas) భారత ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. ఆయన క్షేమంగా స్వదేశానికి వచ్చేలా చూడాలని కోరారు.
28 ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్కు వెళ్లిన నర్సయ్య.. మూడేండ్ల పాటు తాపీ మేస్త్రీగా పనిచేశారని, అయితే వర్క్ పర్మిట్ ముగియడంతో అక్కడే ఉండిపోయాడని చెప్పారు. దీంతో పాస్పోర్ట్, వీసా లేనందున బహ్రెయిన్లో గత కొన్నేండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్.. తక్షణమే స్పందించి ఆయనను దేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. నర్సయ్యను దేశానికి తీసుకువచ్చేందుకు అండగా ఉంటానని తెలిపారు.
బతుకుదెరువు కోసం నర్సయ్య 1996లో బహ్రెయిన్ వెళ్లారు. అకడి ‘ది అరబ్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ’లో మూడేండ్లపాటు తాపీ మేస్త్రీగా పనిచేశారు. 1999 ఆగస్ట్లో వర్ పర్మిట్ ముగిసినా నర్సయ్య అక్కడే పనిచేస్తూ ఉన్నాడు.
పాస్పోర్ట్ గడువు కూడా 2001లో ముగియటంతో బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఆ గడువు కూడా ముగిసిందని, అయితే నర్సయ్య తనవద్దనున్న పాస్పోర్ట్ పొగొట్టుకున్నాడు. వర్ పర్మిట్, పాస్పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడంటూ బహ్రెయిన్ పోలీసులు నర్సయ్యను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. నర్సయ్య విషయమై అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు ఆందోళన చెందుతున్నారు.