హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న వనమా రాఘవను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం వైపు పారిపోతుండగా ఏపీ సరిహద్దులోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి ఘటనలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు 302, 306, 307 కింద కేసులు నమోదు చేశారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రాఘవను పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలించి పట్టుకొన్నారు. వనమా రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలను టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకొన్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఖమ్మం ఇంచార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవను శుక్రవారం ఉదయమే పార్టీ నుంచి సస్పెండ్చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని టీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు వనమా రాఘవను అరెస్టు చేయాలనే డిమాండ్తో శుక్రవారం అఖిలపక్షాలు చేపట్టిన కొత్తగూడెం నియోజకవర్గ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్చేశారు.