హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బీసీ బిల్లూ ప్రవేశపెట్టి అమలు చేయాలి. లేదంటే దీని కోసం మరో జాతీయ పోరాటం జరుగుతుంది. తెలంగాణే దీనికి అంకురార్పణ చేస్తుంది.. అని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మ న్ల సమావేశం స్పష్టం చేసింది. దేశంలో వెనుకబడిన కులాలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హరితప్లాజాలో బుధవారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
బీసీ బిల్లు పెట్టేదాకా వెనుకబడిన కులాలం కేంద్ర ప్రభుత్వం వెంటపడతామని కార్పొరేషన్ల చైర్మన్లు తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్ల తేవడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ పోటీపడి బీసీలను అణిచివేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అనేక దశాబ్దాల తరువాత కేంద్రం మహిళా బిల్లును తెచ్చినందుకు స్వాగతిస్తున్నామని తెలిపారు. మహిళా, బీసీ బిల్లుల కోసం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నందుకు రాష్ట్రంలోని వెనుకబడిన కులా ల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయా బిల్లులు పెట్టాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపు తూ, మహిళా బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైన ఎమ్మెల్సీ కవితను అభినందిస్తూ తీర్మానాలు చేశారు.
రాష్ట్ర టూరి జం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, సాట్స్ చైర్మన్ ఆంజేయగౌడ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, సర్దార్ రవీందర్సింగ్, పిట్టల రవీందర్, మఠం భిక్షపతి, గూడురు శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, శుభప్రద్ పటేల్, సురేందర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తాడూరి శ్రీనివాస్, రాకేశ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు కేంద్రం తీరని అన్యాయం
దేశవ్యాప్తంగా బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న బీసీ కమిషన్లు సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. మహిళా బిల్లులోనూ బీసీ మహిళలకు వాటా ఉండాలన్న సిఫారసులు పట్టించుకోలేదు. మహిళా బిల్లును నేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ లబ్ధి కోణం తప్ప చిత్తశుద్ధిలేదు. డీవోపీటీ సిఫారసులను కేంద్రం అమలు చేయడం లేదు.
– వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీసీ కమిషన్ చైర్మన్
బీసీలకు అండగా కేసీఆర్
తెలంగాణ ఉద్యమకాలం నుంచే బీసీల ఉద్యమాలకు కేసీఆర్ అండగా నిలిచారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్ చేసి బీసీలకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ఉద్యమానికీ కేసీఆర్ మద్దతు ఇచ్చా రు. బీసీ బిల్లును విస్మరించిన బీజేపీ బీసీ వ్యతిరేకి అని నిరూపించుకున్నది.
– గెల్లు శ్రీనివాస్ యాదవ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్
కాంగ్రెస్, బీజేపీ బీసీ వ్యతిరేకం
కాంగ్రెస్, బీజేపీ రెండింటి డీఎన్ఏల్లో బీసీ వ్యతిరేకత ఉన్నది. ఆ రెండు పార్టీలు ఏనాడూ బీసీ వర్గాల అభ్యున్నతికి పాటుపడలేదు. ప్రచారానికి, అధికారంలోకి రావడానికి బీసీలను వాడుకొని వదిలేసే పార్టీలుగా అవి చరిత్రలో నిలిచిపోయా యి. బీసీల వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. కానీ బీఆర్ఎస్ బీసీలకు అండగా నిలిచింది. స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించి సీఎం కేసీఆర్ దేశానికి కొత్తదారి చూపారు.
– ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్
బీసీల ఐక్యతను కూడగడతాం
కేంద్రం బీసీలను తొలి నుంచి తీరని అన్యాయానికి గురిచేస్తున్నది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్రం బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు అన్ని బీసీ సంఘాలను ఏకం చేస్తాం. ఇప్పటికే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్న కేంద్రం, దక్షిణాది రాష్ర్టాల బీసీలను చిన్నచూపు చూస్తున్నదనే వాతావరణం నెలకొన్నది. ఈ తరుణంలో కేంద్రం తాను చేసిన తప్పును అదే సరిదిద్దుకోవాలి.
– పిట్టల రవీందర్, మత్స్య సహకార సంస్థల చైర్మన్
కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీల కోసం మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇందుకోసం ఒకటే గొంతు, ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం. బీసీలను ఐక్యం చేసి పోరాటాలు చేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యేదాకా ఉద్యమిస్తాం. కేంద్రం మెడలు వంచుతాం.
– దూదిమెట్ల బాలరాజు, గొర్రెలు, మేకలు, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్
అన్నివర్గాల మహిళలకు వాటా దక్కాలి
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదించడం శుభపరిణామం. ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. బిల్లులో అన్నివర్గాల మహిళలకు వాటా దక్కాలన్నదే దేశవ్యాప్త బీసీ వర్గాల వాదన. దీనిపై స్పష్టత లేదు. బీసీ రిజర్వేషన్ల చిక్కుముడి వీడకుండా మహిళా బిల్లు సాకారం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు తేవాలి. తనకు తాను బీసీనని చెప్పుకునే మోదీ బీసీలకు ఏం చేశారు అంటే ఫలితం సున్నా.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
కేంద్రం కండ్లు తెరవాలి
అన్నిరంగాల్లో అద్వితీయంగా ముందు కు సాగుతున్న తెలంగాణ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ దేశానికే ది క్సూచిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్ర అసెంబ్లీ బీసీలకు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిం ది. కేంద్రం ఇప్పటికైనా కండ్లు తెరచి బీసీలకు న్యాయం చేయాలి. బీసీ వర్గాల అభ్యున్నతికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేయాలి. లేదంటే బీసీల కోసం తెలంగాణ మరో ఉద్యమానికి పూనుకుంటుంది.
– జూలూరు గౌరీశంకర్, సాహిత్య అకాడమీ చైర్మన్
అన్ని పార్టీలూ మద్దతివ్వాలి
బీసీ ప్రధాని అయితే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించినా ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదు. బీసీ మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేయలే దు. బీసీ కులగణన చేపట్టనేలేదు. ఇప్పు డు కేంద్రం బీసీ బిల్లు పెడితే అన్ని రాజకీ య పార్టీలు మద్దతు ఇస్తాయి. రాష్ట్రంలో ని 33 జిల్లాల్లో బీసీ ప్రజాప్రతినిధులను, ప్రజాసంఘాలను కలిసి రాజకీయాలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు కోర తాం. అన్ని పార్టీలు అండగా నిలబడాలి.
– వీ ప్రకాశ్, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్