హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్- ఇన్- చీఫ్ (ఈఎన్సీ)గా వీ కనకరత్నం నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ఇప్పటివరకు ఈఎన్సీగా ఉన్న సంజీవరావు గతంలో పదవీ విరమణ చేసినా ఆయనను కొనసాగించారు. రిటైర్డ్ అధికారులను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కొత్త వారికి అవకాశం ఇచ్చినట్టుగా సమాచారం. కనకరత్నం 1989లో సర్వీసులో చేరారు. ఆయన ఇప్పటి వరకు సీఈ( టెక్నికల్)గా పనిచేశారు. మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనకు పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.