హుస్నాబాద్, జూన్ 24: సరికొత్త రోడ్ల నిర్మాణానికి పలు జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చు, నాణ్యత ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మిస్తున్నారు. కొబ్బరి పీచు, జౌళితో తయారు చేసిన మ్యాట్ (కాయిర్)ను ఉపయోగించి జియోటెక్స్టైల్ టెక్నాలజీతో ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. కామారెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 121 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. కాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) నుంచి నాగారం మీదుగా ఉమ్మాపూర్ గ్రామం వరకు 3.64 కిలోమీటర్ల మేర ఈ కొత్త విధానంతో రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.2.31 కోట్లు మంజూరయ్యాయి. జియోటెక్స్టైల్ టెక్నాలజీతో నిర్మించే రోడ్లు నాణ్యతతోపాటు నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
జియోటెక్స్టైల్ టెక్నాలజీ ద్వారా రోడ్డు నిర్మాణానికి గాను మొదట రోడ్డుపై మొరం పోసి రోలింగ్ చేస్తారు. అనంతరం కొబ్బరి పీచుతో తయారు చేసిన కాయిర్ (మ్యాట్)ను అమర్చుతారు. దానిపై గ్రాన్యులర్ సబ్బేస్ (కంకర డస్ట్) వేసి రోలింగ్ చేస్తారు. వెడ్ మిక్స్ (40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 4 ఎంఎం చిప్స్, డస్ట్ కలిపి) వేసి మళ్లీ రోలింగ్ చేస్తారు. ఆ తర్వాత బీటీ రోడ్డు వేస్తారు. సాధారణంగా 7 ఇంచుల మందంతో రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ, కొత్త టెక్నాలజీతో కేవలం 5 ఇంచుల ఎత్తు మాత్రమే వేస్తారు. తద్వారా ఖర్చు ఆదా అవుతుంది. మొరంపై వేసిన కాయిర్ కొన్ని రోజుల వరకు బీటీకి నీరు చేరకుండా అడ్డుకుంటుంది. దీంతో బీటీ రోడ్డు అంత తొందరగా దెబ్బతినే అవకాశం ఉండదు. అయితే కొబ్బరి పీచు కాయిర్ మట్టిలో కలిసిపోయినప్పటికీ మొరానికి బీటీకి మధ్య గట్టిదనం ఏర్పడి రోడ్డు నాణ్యతతో ఎక్కువ రోజులు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.