తిరుమలగిరి, ఆగస్టు 14: తండ్రి మృతిని తట్టుకోలేక రోదిస్తున్న కూతురు గుండెనొప్పితో హఠాన్మరణం చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగింది. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన మద్దెల వీరయ్య (85) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆయన కూతురు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నివాసం ఉంటున్న వజ్రమ్మ (60) తిరుమలగిరికి వచ్చి తండ్రి మృతదేహంపై పడి రోదించింది. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రీకూతురు ఒకేరోజు మృతిచెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా.. వజ్రమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు.