హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కార్గో రవాణా సేవలు రెండేండ్లు పూర్తిచేసుకొన్నాయి. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు రూ.123.45 కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడి గోవర్ధన్ వెల్లడించారు. కార్గో సేవలు రెండేండ్లు పూర్తిచేసుకొన్న సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. కార్గో సేవలను ప్రారంభించిన మొదటి సంవత్సరంతో పోలిస్తే రెండో ఏడాది ఎక్కువ మంది వినియోగించుకొన్నట్టు తెలిపారు. కొరియర్ సర్వీసులను వేగవంతం చేశామని, లోపాలను సవరించుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను త్వరలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు విస్తరించనున్నట్టు చెప్పారు. వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో పార్సిళ్లపై టార్పాలిన్ కవర్లు కప్పుతున్నామని, వినియోగదారులు ఎలాంటి సందేహాలు లేకుండా కార్గో సేవలను వినియోగించుకోవచ్చని అభయమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 455 ఆర్టీసీ కార్గో పార్సిల్ సెంటర్లు పనిచేస్తున్నాయని, 177 బస్సులు కార్గో సేవలను అందిస్తున్నాయని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతిచోట కార్గో డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
మేడారం బంగారం (బెల్లం), భద్రాద్రి రామయ్య తలంబ్రాలను సైతం కార్గో చేశామని, ప్రస్తుతం కార్గో ద్వారా బంగినపల్లి మామిడిపండ్లను బుక్ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. వినియోగదారుల సౌలభ్యం కోసం త్వరలో ఆన్లైన్ పేమెంట్ సదుపాయాన్ని అదుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు టీఎస్ ఆర్టీసీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నదని, దీనికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.