హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మరో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో 82ను విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే వీటిల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను నిర్వహించనున్నారు.
ఒక్కో కేజీబీవీల్లో రెండు కోర్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 475 కేజీబీవీలను దశలవారీగా ఇంటర్ వరకు పెంచుతున్నారు. ఇప్పటివరకు 245 కేజీబీవీల్లో ఇంటర్ చదువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికల వసతి, చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నది. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడమే కాకుండా కరాటే, యోగ, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.