CPI Leader Ramakrishna | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంపై గతంలో పదేపదే ప్రచారం చేసిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు అయోధ్య రాముని విరాళాల చోరీ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు.
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎక్కడపడితే అక్కడ విమర్శలు చేసి, ఏకంగా తిరుమలకు పాదయాత్రలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అయోధ్య రామభక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న వీరు ఈ నిధుల దుర్వినియోగంపై సమాధానం చెప్పాలన్నారు. సనాతన ధర్మ ప్రచారకర్తగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, భక్తుల మనోభావాలను కాపాడటానికి ఇప్పుడు అమరావతి నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.