స్వరాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోతున్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళలు అన్ని రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ సమాన అవకాశాలను పొందుతున్నారు. చరిత్రను తిరగరాస్తున్నారు. ఎన్నడూ తమ దరిచేరని, కనీసం కలలో కూడా ఊహించని పదవులను చేబూనుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుండటమే అందుకు కారణం. నామినేటెడ్ పదవుల్లోనూ అతివలకే టీఆర్ఎస్ పెద్దపీట వేస్తూ వస్తున్నది. మార్కెట్, ఆలయ తదితర కమిటీల్లో వారికీ అవకాశాలను కల్పిస్తున్నారు. అందుకు ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ‘హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. అదీగాక కీలక పదవులను కట్టబెట్టారు. ఈ ఏడాది ముగ్గురు మహిళలు కీలక స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.
జీహెచ్ఎంసీలో మహిళలకే 85 సీట్లు..
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1955లో ఏర్పడినా పాలన పగ్గాలను చేపట్టే బాధ్యత మహిళలకు మాత్రం అరుదుగానే దక్కింది. అది కూడా పూర్తికాలం దక్కని దుస్థితి. రెండేండ్లు.. మహా అయితే మూడేండ్లకు మించి పాలన పగ్గాలను చేపట్టింది ఒక్కరూ లేకపోవడం విచారకరం. అందుకు భిన్నంగా, మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సారి పూర్తిగా కట్టబెట్టడం విశేషం. జనరల్ మహిళకు కేటాయించడంతో ఐదేళ్ల పాటు పాలన కొసాగించే అవకాశం తొలిసారిగా దక్కింది. మేయర్ పీఠాన్ని గద్వాల విజయలక్ష్మి అధిరోహించారు. అదీగాక మొత్తం 150 కార్పొరేట్ స్థానాల్లో అత్యధికంగా 85 సీట్లను మహిళలకే కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిలో అత్యధికంగా మహిళలే ఉండటం విశేషం.
నగర గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్..
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ అతివలకే టీఆర్ఎస్ పెద్దపీట వేస్తూ వస్తున్నది. మార్కెట్, ఆలయ తదితర కమిటీల్లో వారికీ అవకాశాలను కల్పిస్తున్నది. అందుకు చిక్కడపల్లిలోని వట్టికోట ఆళ్వార్స్వామి నగర గ్రంథాలయమే నిదర్శనం. దశాబ్దాల చరిత్ర ఉన్న, హైదరాబాద్ పట్టణంలో 82 లైబ్రరీలకు ప్రాతినిధ్యం వహించే గ్రంథాలయానికి చైర్ పర్సన్గా కే.ప్రసన్న రామ్మూర్తిని నియమించడం మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నది. అదీగాక మార్కెట్ కమిటీ చైర్మన్లుగానే ఎందరికో అవకాశం కల్పించారు.
చరిత్రను తిరగరాసిన వాణీదేవి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారిగా మహిళా అభ్యర్థి సురభి వాణీదేవిని బరిలో దింపి అధికార, ప్రధాన పార్టీ టీఆర్ఎస్ కొత్త చరిత్రను సృష్టించింది. స్వతహాగా గొప్ప చిత్రకారిణి, దశాబ్దాలుగా అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనతతో పాటు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ కుమార్తెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. అక్కడితో ఆగకుండా ఆమె గెలుపుకోసం ఎప్పటికప్పుడు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపించారు. జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించి బాధ్యతలను అప్పగించారు. మహిళలు, పట్టభద్రులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్గాలు మద్దతును కూడగట్టి ఆమెను విజయతీరాలకు చేర్చారు. దీంతో మహిళల ఖాతాలో మరో కీలక పదవి చేరింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీచేసి గెలిచిన మహిళగానూ వాణీదేవి రికార్డును సృష్టించారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
తొలిసారిగా మహిళకు డిప్యూటీ మేయర్ పదవి..
దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి టీఆర్ఎస్ పార్టీ ఈ సారి స్వస్తి పలికింది. డిప్యూటీ మేయర్ పదవిని సైతం మహిళకే కట్టబెట్టింది. ఇప్పటి వరకు పొత్తుల్లో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి కీలక పాత్రను పోషిస్తూ వస్తున్నది. ఏక పక్ష మెజార్టీతో టీఆర్ఎస్ మినహా జీహెచ్ఎంసీ పీఠాన్ని ఇప్పటివరకు ఏ పార్టీ కూడా కైవసం చేసుకోలేదు. బొటాబోటి మెజార్టీతోనే కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకునేవి. ఆ తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకునేవారు. తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ఈ విధానానికి చరమగీతం పాడింది. ఐదేళ్ల పాటు మేయర్గా ఒక్కరినే కొనసాగించింది. తాజాగా మరోసారి మేయర్ పదవిని కైవసం చేసుకుంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా అతివలకే టీఆర్ఎస్ అధినేత అప్పగించారు. బల్దియా చరిత్రలోనే డిప్యూటీ మేయర్ పదవిని మొదటిసారిగా మోతె శ్రీలతారెడ్డి చేపట్టారు.