హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ కే చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. తాజా పరిస్థితులను అంచనావేసి, రాబోయే మూడు నెలలకోసం ప్రణాళిక అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవిడ్ పరీక్షలు, పడకలు, చికిత్స, హోం ఐసొలేషన్ కిట్లు తదితర అన్ని అంశాల్లో ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. వైరస్ కట్టడి విషయంలో ఇతర రాష్ర్టాలకంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నదని చెప్పారు. అన్ని విభాగాలను సమన్వయం చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నామన్నారు. ప్రభుత్వం, వైద్యుల కృషికి ప్రజల మద్దతు అవసరమని, కొవిడ్ మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలపై బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
టెస్టులు రెట్టింపు
ప్రస్తుతం రోజూ 60 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో రోజుకు లక్షా 20 వేలకు పెంచాలని నిర్ణయించాం. దీనికి అనుగుణంగా ఆర్టీపీసీఆర్ సెంటర్లు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను సిద్ధం చేసుకుంటున్నాం. ప్రస్తుతం 17 కేంద్రాల్లో ఒక్కో సెంటర్లో రోజుకు 500 నుంచి 1,000 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. 33 జిల్లాకేంద్రాల్లోని జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రా లు ఏర్పాటు చేయబోతున్నాం. కరో నా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్లు ఇస్తున్నాం. నెగెటివ్ వచ్చి కొవిడ్ లక్షణాలున్న వారికీ వైద్యుల సూచన మేరకు కిట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 3 లక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయి. మూడునెలల్లో 15 లక్షల కిట్లు అవసరం అవుతాయని అంచనా వేసి సమకూర్చుకొంటున్నాం. కొవిడ్ రోగులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే సమీపంలోని దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్లను ఏర్పాటుచేస్తున్నాం.
24 వేల పడకలు
రాష్ట్రంలో కొవిడ్ చికిత్సకు పడకల కొరత లేదు. అన్ని రకాలు కలిపి 24 వేలదాకా ఉన్నాయి. ఒక్క టిమ్స్లోనే 1,200 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర దవాఖానల్లో ఉన్నవాటికి ఇవి అదనం. 33 జిల్లాల్లో వంద పడకలతో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుచేశాం. 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు సిద్ధమవుతున్నాయి. ప్రధాన దవాఖానల్లో స్కానింగ్ వేగం పెంచేందుకు కొత్తగా 12 సీటీ స్కానింగ్ మిషిన్లు కొనుగోలు చేస్తున్నాం. వైరస్ వ్యాప్తి తగ్గిందని నిర్లక్ష్యం చేయడంవల్లనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. ఒకేసారి వైరస్ వ్యాప్తి పెరిగితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్యారోగ్యం, పోలీసులు, పంచాయతీ, పారిశుద్ధ్యశాఖలు ఎంతో శ్రమిస్తున్నాయి. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి.