TS Weather | మార్చికి ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం నుంచి ఎండల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
రాబోయే వారం పది రోజులుగా మండే ఎండలతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బలమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జనం ఆందోళనకు గురవుతున్నారు.