హైదరాబాద్ : తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్ పీఈసెట్-2022) నిర్వహణకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21న (బుధవారం) నిర్వహించనున్న పరీక్షకు నాలుగు జిల్లాల్లో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఫిజికల్ ఈవెంట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,632 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. సోమవారం రాత్రి వరకు 3,552 మంది అభ్యర్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. సెట్ చైర్మన్గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డి, కన్వీనర్గా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.
ఎంజీయూలో పరీక్షల ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. అదేవిధంగా ప్రత్యేక కేటగిరి (ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్ అండ్ గేమ్స్ తదితర) అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
1. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ
2. శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, శ్రీనాథపురం, అనుముల మండలం, నల్లగొండ జిల్లా
3. ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా
4. సిద్దార్థ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వినోభానగర్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
5. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బొల్లికుంట, వరంగల్ అర్బన్ జిల్లా
6. వేదా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కొండపాక, సిద్దిపేట