హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంథా అనుసరిస్తున్నది. ఏటేటా అఫిలియేషన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి మూడు లేదా ఐదేండ్లకు ఒకేసారి అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు ఏటా అఫిలియేషన్ కోసం ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ తిరగాల్సిన పని తప్పనున్నది. కాలేజీలు సమర్పించే భవనం లీజు ఒప్పందాన్ని అనుసరించి ఒకేసారి మూడేండ్లు లేదా ఐదేండ్లుకు అనుమతులిస్తారు. అయితే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) వెబ్సైట్ను ఒక ఏడాదికి మాత్రమే అనుమతులిచ్చేలా రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్లో మూడేండ్లకు లేదా ఐదేండ్లకు అనుమతులిచ్చేలా మార్పులు చేయాల్సి ఉన్నది. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఏడాది కాలానికే అనుమతులిస్తున్నారు. సాఫ్ట్వేర్లో మార్పులు చేసిన వెంటనే మూడు, లేదా ఐదేండ్లకు అనుమతులు జారీ చేస్తారు.
2,271 కాలేజీలకు అనుమతులు
2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు కోసం 3,111 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఏడాది మిక్స్డ్ ఆక్యుపెన్సీ (కాలేజీ నడుస్తున్న భవనంలోనే మరికొన్ని సంస్థలు) గల కాలేజీలకు ఫైర్ ఎన్వోసీతో నిమిత్తం లేకుండా అఫిలియేషన్ల జారీకి ప్రభుత్వం గతంలోనే అనుమతులిచ్చింది. గతంలో అఫిలియేషన్ల జారీ ప్రక్రియ ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొనసాగేది. కీలక ప్రతిబంధకమైన ఫైర్ ఎన్వోసీ జంజాటం లేకపోవడంతో ఈ సారి కాస్త ముందుగానే అఫిలియేషన్లు జారీచేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వివిధ క్యాటగిరీలకు చెందిన 2,271 కాలేజీలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.