హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావాలన్నారు. 1991 నుంచి 2020 వరకు శ్రీశైలంలో 834 అడుగులపైన నీటిమట్టం లేదన్నారు. ఏపీ బేసిన్ వెలుపలకు నీటి తరలింపు కోసం 854 అడుగులు ఉండాలంటోంది. కృష్ణా డెల్టా కోసం 760 అడుగుల వరకూ నీరు వదిలేలా 2013లో మెమో ఉంది.
ఏపీ రెండేళ్లుగా 170 టీఎంసీలు, 124 టీఎంసీలు తరలించినట్లు తెలిపారు. చెన్నై తాగునీటి కోసం ఏపీ 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదన్నారు. పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు ఉందన్న ఈఎన్సీ తెలంగాణ విద్యుదుత్పత్తితో ఏపీకి నష్టమున్న వాదన నిరాధారమన్నారు. 50 శాతం నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదన్నారు. ముందు చేసుకున్న అవగాహన ఆ ఏడాదికే వర్తిస్తుందన్నారు.
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు, ప్రణాళిక సంఘం నివేదికకు లోబడే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. సాగర్లో క్యారీ ఓవర్ స్టోరేజ్ ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు అసంబద్ధమని తెలిపారు. ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మా వాటా నీటిని విచక్షణ, అవసరాల మేరకు వాడుతున్నట్లు పేర్కొన్నారు.