హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నింటిలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలోని తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% పీఎల్ఎఫ్ను నమోదు చేశాయి. పశ్చిమ బెంగాల్లోని విద్యుత్తు సంస్థలు 72% పీఎల్ఎఫ్తో రెండో స్థానంలో నిలిచాయి. దేశంలోని 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లలో చూసుకొంటే.. మన కేటీపీఎస్ ఏడో దశ ఏకంగా 83.56% పీఎల్ఎఫ్తో టాప్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) 70% పీఎల్ఎఫ్ను మాత్రమే సాధించింది. ఎన్టీపీసీతోపాటు కేంద్రం పరిధిలోని ఇతర విద్యుత్తు కేంద్రాలన్నింటిలో కలిపి కేవలం 69% పీఎల్ఎఫ్ నమోదవగా.. దేశ సగటు పీఎల్ఎఫ్ 58 శాతంగా నమోదైంది.
ఒక విద్యుత్తు కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నదో చెప్పేదే పీఎల్ఎఫ్. ఉదాహరణకు 100 మెగావాట్ల పూర్తి సామర్థ్యం కలిగిన ఒక విద్యుత్తు కేంద్రంలో 75 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్టయితే.. అప్పుడు దాని పీఎల్ఎఫ్ను 75 శాతంగా పేర్కొంటారు. ఈ లెక్కన తెలంగాణలోని ప్రభుత్వ రంగ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు 73.87% సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు చెప్పవచ్చు. పీఎల్ఎఫ్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన టీఎస్ జెన్కో ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు.