TS EdCET 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును ఏప్రిల్ 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీన దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్సెట్ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు. ఎడ్సెట్ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.