TS ECET | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ సీట్ల కేటాయింపు తొలి విడత ప్రక్రియ ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్నది. పాలిటెక్నిక్తో పాటు బీఎస్సీ మ్యాథ్స్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 20 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్కు 23 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 22 వేల మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. వీరిలో 20,899 మంది ఉత్తీర్ణత పొందారు. రెండు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 26 నుంచి 30 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తారు. నిరుడు ఈసెట్లో 11 వేలకు పైగా సీట్లు ఉండగా, 10 వేల సీట్లు భర్తీ అయ్యాయి.