హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానం అసాధారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు దశాబ్దాలపాటు మనగలగటం గొప్ప విషయమని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు అనేక పార్టీలు వచ్చినా, విజయవంతంగా నిలబడినవి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. తెలంగాణ సుదీర్ఘ ప్రయోజనాలు కాపాడే రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తాము మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర పరిపాలన, పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని, ఇప్పుడు పాలనతోపాటు పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసుకోవటంపై పనిచేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని కేటీఆర్ అన్నారు. ‘మనల్ని అనుకరించటం కన్నా గొప్ప కాంప్లిమెంట్ మరొకటి ఉండదు. మన పథకాలను కేంద్రం స్వీకరించి దేశమంతా అమలు చేస్తున్నది. అది మనకు గర్వకారణం. మన రైతుబంధు నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, మిషన్ భగీరథ నుంచి హర్ఘర్ జల్, తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ లంగ్స్పేస్ నుంచి నగర్ వన్, టీఎస్ఐపాస్ నుంచి ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ పుట్టుకొచ్చాయి’ అని వివరించారు.
పటిష్ఠంగా పార్టీ నిర్మాణం
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అన్నిస్థాయిల కమిటీల ఎన్నిక పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మొదలైందని, కేసీఆర్ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు, ఈ నెల 25న పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల కోసం రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన, సంస్థాగత శిక్షణ.. ఇలా దాదాపు 9 నెలలు ఏకోన్ముఖంగా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.
విజయగర్జన సభ విజయవంతానికి ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. పార్టీలోని అన్ని స్థాయిల కమిటీలు బహిరంగ సభకు సొంత వాహనాలు ఏర్పాటుచేసుకొని రావాలని సూచించారు. వచ్చే నెల 15 తర్వాత హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి మినహా అన్ని చోట్ల పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించి, మంత్రుల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎంపిక చేసిన దాదాపు 6,500 మందితో ప్లీనరీ నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీ తర్వాత పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ కలిసి జిల్లా అధ్యక్షులపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్లీనరీలో అధ్యక్షుడి ఎన్నిక అనంతరం రాజకీయ తీర్మానాలు, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయని వెల్లడించారు.
వరంగల్ మాకు కలిసివచ్చిన జిల్లా..
ఏ పెద్ద బహిరంగ సభ పెట్టినా మొదటి నుంచీ తమకు వరంగల్ కలిసివచ్చిన జిల్లా అని, అందుకే అక్కడ విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సభ ద్వారా తెలంగాణ కోసం టీఆర్ఎస్ 14 ఏండ్లపాటు సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని పునఃశ్చరణ చేసుకుంటామని చెప్పారు.
టీఆర్ఎస్ గాలివాటం పార్టీ కాదు
టీఆర్ఎస్ గాలివాటం పార్టీ కాదని, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మాదిరిగా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడే స్వీయ రాజకీయ అస్తిత్వంగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని కేటీఆర్ చెప్పారు. ‘ఈ రాష్ట్రం మనగలుగుతుంది. దేశంలో అగ్రగామి అవుతుందని ఉద్యమ సమయంలో చెప్పిన అనేక విషయాలను నిజం చేసి చూపెట్టాల్సిన బాధ్యత మా మీద ఉండటం వల్ల మొదటి టర్మ్ అంతా ప్రభుత్వ నిర్వహణపై దృష్టి సారించాం. సెకండ్ టర్మ్లో రెండున్నరేండ్లు పూర్తి అయ్యాయి. మొత్తం ఏడున్నరేండ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిని కార్యకర్తలకు చెప్పుకొని ప్రజల వద్దకు చేరవేసేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నది’ అని కేటీఆర్ తెలిపారు.
నవంబర్ 15న ప్రయాణాలు వాయిదా వేసుకోండి
వరంగల్లో నవంబర్ 15న తెలంగాణ విజయగర్జన బహిరంగభ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను భారీగా అద్దెకు తీసుకొంటున్నామని, దీంతో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగే ఆస్కారం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అసౌకర్యానికి పార్టీ పక్షాన మన్నించాలని కోరారు.
బలమైన పార్టీ.. పోటీ సహజం
బహుళ నాయకత్వం టీఆర్ఎస్ బలానికి సంకేతమని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలుండటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో గెలిచే అవకాశాలులేని వాళ్లే కొట్టుకొని చస్తుంటే, తమ పార్టీలో గ్యారెంటీగా గెలుస్తరు అనుకునేచోట పోటీ ఉండటం సహజమేనని వ్యాఖ్యానించారు. తమకు బలమైన నాయకుడు ఉన్నారని, బలహీనతలు లేవని స్పష్టంచేశారు. బహుళ నాయకత్వం ఉన్నచోట అవకాశాలను బట్టి పదవులు ఇచ్చుకున్నామని చెప్పారు. విజయగర్జన సభ తర్వాత పార్టీ నేతల బృందం తమిళనాడు వెళ్లి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తుందని తెలిపారు. చిట్చాట్లో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, భానుప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.