కెరీర్ కోసం, పొదుపు-మదుపు కోసం ఓ ప్రణాళిక అంటూ ఉండాలంటారు. కానీ, పిల్లల్ని కనడానికి కూడా ప్లానింగ్ అవసరమా? అంటే, అవసరమేనని చెబుతారు వైద్య నిపుణులు. ‘ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్’తోనే తల్లి-బిడ్డ ఆరోగ్యంగా ఉంటారనీ, డెలివరీ సురక్షితంగా అవుతుందనీ భరోసా ఇస్తున్నారు. దంపతులు పిల్లల్ని కనాలని నిర్ణయించుకొన్న మరుక్షణమే ఆ ప్రణాళిక అమలులోకి వస్తుంది.
యువతీయువకులు పెండ్లి కంటే ముందు కెరీర్పై ఫోకస్ పెడుతున్నారు. పెండ్లి తర్వాత కూడా చాలాకాలం కెరీర్ వెనకాలే పరుగెత్తుతున్నారు. అసలే ఆలస్య వివాహాలు, ఆపైన ఆలస్య గర్భధారణ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ‘ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్’ ఎంతో ముఖ్యం. పిల్లల్ని కనాలని నిర్ణయించుకోగానే భార్యాభర్తలు నిపుణులను సంప్రదించాలి. వైద్యుల సూచనల ప్రకారం అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. ఇద్దరికీ ఎలాంటి సమస్యలూ లేకపోతే ఫరవాలేదు. వెంటనే పిల్లల్ని కనొచ్చు. అలాకాకుండా, భార్యాభర్తల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ముందుగా ఆ రుగ్మతకు చికిత్స తీసుకోవాలి. దీనివల్ల భవిష్యత్లో తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎలాంటి సమస్యా రాదు. చాలా కేసుల్లో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కౌన్సెలింగ్కు వచ్చినప్పుడే ఆ మహిళకు థైరాయిడ్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ప్రణాళిక అంటూ లేకపోతే, వైద్యుల దగ్గరికే వెళ్లకపోతే.. సమస్య సమస్యగానే మిగిలిపోయేది. తల్లికి, బిడ్డకు ఇబ్బంది అయ్యేది. శరీరంలోని కొన్ని సమస్యలు రోగ నిర్ధారణ పరీక్షలప్పుడే బయట పడతాయి. కాబట్టి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొనే ముందు డాక్టర్ను సంప్రదించడం అన్ని విధాలా మంచిది.
ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్లో వైద్యులు ముందుగా కుటుంబ చరిత్రను తెలుసుకుంటారు. బీపీ, డయాబెటిస్, ఎపిలెప్సీ (మూర్ఛ), థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకుంటారు. ఒకవేళ ఉంటే, వాటిని నియంత్రణలో పెట్టుకునేందుకు మార్గాలు చెప్తారు. తగిన మందులు ఇస్తారు. ఈమధ్య మహిళల్లో పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) సర్వసాధారణంగా కనిపిస్తున్నది. గర్భధారణకు ముందే అలాంటి సమస్యల్ని దూరం చేసుకోవడం ఉత్తమం. గతంలో అబార్షన్స్ లాంటివి జరిగి ఉంటే, దానికి కారణాలను అధ్యయనం చేస్తారు. ఫ్యామిలీ హిస్టరీలో జన్యుపరమైన లోపాలుంటే జెనెటిక్ కౌన్సెలింగ్కు పంపుతారు. అలాగే దంపతుల వృత్తి ఉద్యోగాలనుబట్టి ఆహారం, విశ్రాంతికి సంబంధించిన జాగ్రత్తలు చెప్తారు.
వ్యాక్సినేషన్..
ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వచ్చిన దంపతులకు చిన్నప్పుడు సరైన వ్యాక్సినేషన్ జరిగిందో లేదో కూడా తెలుసుకుంటారు వైద్యులు. ఉదాహరణకు అప్పటివరకూ రుబెల్లా, చికెన్పాక్స్, హెపటైటిస్-బికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకోనట్టయితే ఆ పని వెంటనే పూర్తి చేస్తారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ వచ్చాక ఆయా జబ్బులు రాకుండా ఇదో ముందు జాగ్రత్త. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎన్ని వారాల పాటు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలో కూడా వివరంగా చెప్తారు.
అవగాహన పెరగాలి
ఇప్పటికీ చాలామందికి ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి అవగాహన లేదు. నగరాల్లో అయితే, కొంతవరకు ఫర్వాలేదు. గర్భధారణ ప్రణాళికలో భార్యాభర్తల ఆరోగ్యాన్ని అధ్యయనం చేసి, అవసరమైన పరీక్షలు చేస్తారు. ఎలాంటి లోపాలూ లేని పండంటి బిడ్డకు జన్మనివ్వడానికే ఈ ప్రయత్నమంతా. ముఖ్యంగా మేనరికపు పెండ్లిళ్ల వల్ల బిడ్డల్లో జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకునే ముందు జెనెటిక్ కౌన్సెలింగ్కు, సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ప్రెగ్నెన్సీకి ప్రయత్నించేవారు మూడు నెలల ముందునుంచే రోజుకొక 5ఎంజీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా నివారించవచ్చు. అలాగే ఐరన్, క్యాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్స్ వాడాలి.
తొందరెందుకు?
మరోవైపు, కొందరు దంపతులు పెండ్లయిన రెండు, మూడు నెలలకే ప్రెగ్నెన్సీ రావడం లేదని హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతారు. అంత తొందర అవసరం లేదు. భార్య వయసు ముప్పై ఏండ్ల లోపు ఉంటే, ఏడాది వరకు వేచి చూడాలి. ముప్పై పైబడితే ఆరునెలల తర్వాత డాక్టర్ను సంప్రదించొచ్చు. ఏదేమైనా మహిళలు 22-33 ఏండ్ల మధ్యలో గర్భం దాల్చితేనే ఎలాంటి సమస్యలూ రావు. ఇప్పుడు చాలామంది కెరీర్ తాపత్రయంతో పిల్లల్ని ఆలస్యంగా కంటూ కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ హై బ్లడ్ ప్రెషర్ (బీపీ), డయాబెటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ. అలాగే, బిడ్డలకు డౌన్ సిండ్రోమ్ సమస్యా రావచ్చు.
నేచురల్ ప్రెగ్నెన్సీకి ఫలానా సమయం అంటూ ఏమీ ఉండదు. ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)కి మాత్రం సీజన్ను చూస్తారు. మార్చి నుంచి జూన్ వరకు వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ప్రొసీజర్ వద్దంటారు. సాధారణ గర్భం దాల్చేందుకు ఫలానా నెల, ఫలానా వాతావరణం అనుకూలమని చెప్పడానికి ఏమీ ఉండదు. కెరీర్కూ, పొదుపు-మదుపులకూ ఉన్నట్టే.. గర్భధారణకు ముందూ ఓ ప్రణాళిక ఉంటుందని మరచిపోకూడదు. ఎంత దీర్ఘ ప్రణాళిక ఉంటే, అంత ఆరోగ్యకరమైన శిశువు!
ఆహార నియమాలు
జంక్ఫుడ్ను పూర్తిగా దూరం పెట్టాలి.
తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.
భోజనంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండాలి.
ప్రొటీన్ ఎక్కువగా ఉండే గుడ్డు, చికెన్తో పాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే చేపలు తినాలి.
పప్పు ధాన్యాలు, మొలకలు, బాదం గింజలు తీసుకోవాలి.
అనీమియా బారిన పడకుండా ఉండేందుకు బెల్లం పట్టీలు, రాగి జావ తీసుకోవాలి.
చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లయిన సపోటా, మామిడి, సీతాఫలం, ద్రాక్ష మితంగా తినాలి.
కాబోయే అమ్మలు..
బీపీ, షుగర్, థైరాయిడ్ (ఉంటే..) ఎప్పటి కప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.
కనీసం వారానికి ఐదు రోజులు, రోజూ గంటసేపు వ్యాయామం లేదా యోగా చేయాలి.
ఆస్తమా ఉన్నవాళ్లు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
వెజీనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి.
ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటే న్యూరో స్పెషలిస్ట్ను సంప్రదించాలి.
గుండె సంబంధిత వ్యాధులుంటే కార్డియాలజిస్ట్ సలహాలు తీసుకోవాలి.
భార్యతోపాటు భర్తకూడా ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
-నిఖిత నెల్లుట్ల
డాక్టర్ ఎం.ప్రత్యూష రెడ్డి
కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్
అండ్ గైనకాలజీ
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్