హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బేరగాళ్లు, జూటాగాళ్ల పార్టీ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీజేపీలో స్క్రిప్ట్ ఒక్కటే.. డబ్బింగ్ ఆర్టిస్టులు రోజుకొకరు మారుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. బలవంతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చౌహాన్ లాక్కొని చోర్గా మారారు అని మండిపడ్డారు. గతంలో తెలంగాణ పథకాలను పొగిడిన చౌహాన్ నిన్న పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ వ్యాపమ్ చౌహాన్ హయాంలోనే అయింది. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
మధ్యప్రదేశ్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మధ్యప్రదేశ్లో అమలవుతున్నాయా? అని అడిగారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.