హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్రెడ్డి, ఎస్ భరత్కుమార్ శుక్రవారం సీఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలను గెలిపించేందుకు జగ్గారెడ్డి ఓటర్లను డబ్బులతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. ఓటుకు రూ. 50 వేలు ఇస్తానని, గెలిచిన తరువాత రూ. 2 లక్షలు ఇచ్చి వినోద యాత్రకు తీసుకెళ్తానని జగ్గారెడ్డి బహిరంగంగానే ప్రకటించారని పేర్కొన్నారు. ‘ఒక్కొక్కరికీ రూ. 50వేలు, గెలిపిస్తే చాలు అందరికీ నజరానా’ అనే శీర్షికలతో కొన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన కథనాలు క్లిప్పింగ్లను టీఆర్ఎస్ నేతలు సీఈవోకు అందజేశారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య మూలసూత్రానికి భంగం కలుగుతుందని, జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.