హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని హత్యచేసేందుకు యత్నించిన నిజామాబాద్ జిల్లా కల్లాడి గ్రామ సర్పంచ్(సస్పెండెడ్) లావణ్య భర్త పెద్దగాని ప్రసాద్గౌడ్ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఘటన వివరాలను వెస్ట్జోన్ డీసీపీ జోయెల్డేవిస్ సోమవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కల్లాడి సర్పంచ్గా లావణ్య ఎన్నికవగా, గ్రామాభివృద్ధి పనులు ప్రసాద్ నిర్వహించేవాడు. కొన్ని అవకతవకలు జరగటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో లావణ్యను సర్పంచ్ పోస్టు నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
అప్పటికే కొన్ని బిల్లులు పెండింగ్లో ఉండటం, తన భార్య సస్పెండ్కు ఎమ్మెల్యే జీవన్రెడ్డి కారణమని ప్రసాద్గౌడ్ కోపం పెంచుకున్నాడు. ఆయనకు ఎలాగైనా హాని తలపెట్టాలని భావించాడు. మహారాష్ట్ర నాందేడ్ నుంచి బటన్ నైఫ్, హైదరాబాద్లో సంతోష్ సహాయంతో ఎయిర్పిస్టల్ కొన్నాడు. నిజామాబాద్కు చెందిన సుగుణ, బాల్కొండకు చెందిన సురేందర్ దయావత్లు బీహార్లో మున్నాకుమార్ వద్ద రూ.60 వేలకు తుపాకీ దొరుకుతుందని ప్రసాద్కు చెప్పారు. వీరికి డబ్బు అందజేయగా, గత నెల 15న నల్లగొండకు చెందిన శ్రీహరి, సురేందర్ నిజామాబాద్లోని భీమ్గల్లో ప్రసాద్కు తుపాకి అప్పగించారు, వీటికి బుల్లెట్లు ఇవ్వలేదు. బుల్లెట్ల కోసం గత నెల 25న మరోవ్యక్తి దమ్మై సాగర్తో ప్రసాద్ కలిసి బీహార్లోని ముజఫర్పూర్ వెళ్లి విఫలయత్నం చేసి వెనుతిరిగారు.
ఎమ్మెల్యే గదిలోకి దూసుకుపోయి
1న ప్రసాద్ తన కారులో నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్లో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నాడు. మూడో అంతస్థులో ఉన్నాడని ఎమ్మెల్యే వంట మనిషి ద్వారా తెలుసుకొని నేరుగా బెడ్రూంకు వెళ్లాడు. లోడ్ చేసిన ఎయిర్ పిస్టల్ను ఎమ్మెల్యేకు పాయింట్బ్లాక్లో గురిపెట్టాడు. అప్రమత్తమైన ఎమ్మెల్యే పెద్దగా అరిచారు. సిబ్బంది రావటంతో ప్రసాద్ పరారయ్యాడు. విశ్వసనీయ సమాచారంతో ప్రసాద్ను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకొని దేశీయ తుపాకి, అదనపు మ్యాగ్జిన్తో, బటన్ నైఫ్, ఎయిర్ పిస్టల్, ఎయిర్ రైఫిల్ పెల్లెట్స్, కారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో మిగతావారంతా పరారీలో ఉన్నారు.