రాష్ట్రమొస్తే చీకట్లపాలైతదన్నరు. ఏట్లున్నది తెలంగాణ?
కంపెనీలు మూతబడుతయన్నరు. కంపెనీలు ఎట్లున్నయిప్పుడు?
కంపెనీలు పారిపోతయన్నరు. కంపెనీలు ఏడ పెడుతున్నరిప్పుడు?
కొలువులు పోతయన్నరు?
ఎక్కడ కొలువులిస్తున్నరిప్పుడు?
దేశమంతా చీకటైన వేళ వెలుగు ఎక్కడున్నదిప్పుడు?
కరెంటు కోతల్లేని తెలంగాణల బతుకెట్ల బాగుపడ్డదో హైదరాబాద్లోని బాలాపూర్ పారిశ్రామికవాడలో ఉన్న పీఈ ఇంజినీర్స్ కంపెనీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అందులో పనిచేసే కార్మికుడు మల్లయ్యను , మరో కంపెనీ నడిపే శ్రీనివాస్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లలో వచ్చిన మార్పేమిటో చెప్తారు.
నీరుపోసి చెట్టును చిగురింపజేసినట్టు.. పడావుపడ్డ పరిశ్రమలకు ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమం. ‘వేరు తెలంగాణ చీకట్ల పాలవుతదన్న భయంపోయి అభివృద్ధిలో తెలంగాణ తీరే వేరు’ అన్న భరోసానిచ్చింది. పురిట్లోనే ఆగమైతదనే భయాలను పారదోలి.. అభివృద్ధి పరుగులో పెద్ద రాష్ర్టాలను దాటిపోయింది. పచ్చని చెట్టు మీద పిచ్చుకలు వాలినట్టు కరెంటుకు కొరతలేని తెలంగాణలో దేశవిదేశాల నుంచి కంపెనీలు వచ్చి వాలిపోతున్నాయ్! ఎన్నో రాష్ర్టాలు చీకట్ల మగ్గుతుంటె తెలంగాణ పారిశ్రామిక ప్రగతి విద్యుత్తు కాంతులతో ధగధగా మెరుస్తున్నది! సంక్షేమానికి, అభివృద్ధికి విద్యుత్తే ప్రామాణికం. తెలంగాణ గెలిచిందనడానికి ఇంతకన్నా రుజువేం గావాలె? అంటున్నరు కంపెనీ ఓనర్లు, కార్మికులు. ఇంతకన్నా గొప్ప సంబురం ఉంటదా? బంగారు తెలంగాణ అంటే గిదే కదా.
హైదరాబాద్, మే 12, నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ వస్తే ఏమొస్తది? ఎవరికి మేలు చేస్తది అని అన్నరు. తెలంగాణ వచ్చినంక కోతల్లేని కరెంటొచ్చింది. అంతకుముందు కరెంటు కోతలే కాదు.. కోతలు కోసే నాయకులు కూడా ఉండేటోళ్లు. ఇప్పుడు కరెంట్ కోతల్లేవు.. బూటకపు హామీలిచ్చే లీడర్లూ లేరు. ఈ కోతల్లేని తెలంగాణల బతుకెట్ల బాగుపడ్డదో మాట్లాడుకుందాం రండి అంటే కంపెనీ శ్రీనన్న, కార్మికుడు మల్లన్న ముందుకొచ్చిన్రు. అభివృద్ధి ఎక్కడ ఉందో? తెలంగాణ ఎట్లున్నదో? వాళ్ల్లే చెబుతున్నరు.
కూలన్న కథ..
మహబూబాబాద్ దగ్గరున్న కంబాలపల్లికి చెందిన దాసరి మల్లయ్య పేదింటి బిడ్డ. జమాన కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిండు. బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాల ఉన్న పీఈ ఇంజినీర్స్ కంపెనీల వెల్డర్గా చేరిండు. ఎంతో కొంత జీతం.. పనికి తగ్గ ఇన్సెంటివ్ ఇస్తున్నరు. మల్లయ్య పనిచేసే కంపెనీల కరెంటు సరఫరా చేసే ట్రాన్స్మీటర్లకు వాడే రేడియేటర్స్ తయారయ్యేవి. పద్దెనిమిది నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్, నెలకు పది వేల లెక్కన మూడు నెలలకు ఒకపాలి ముప్పై వేలు దాంక ఇన్సెంటివ్ వస్తున్నది. ఇద్దరు కొడుకుల్ని మంచి కాలేజీల్ల చదివిస్తున్నడు. ఫీజులకి, పుస్తకాలకి లోటు రానియ్యలే.
గెలవాల్నని కల..
ఆస్తులు, పెద్ద చదువులేని మల్లయ్య కొలువు దొరికితే సాలనుకున్నడు. కానీ కొద్దిగ పైసలున్న అంబటి శ్రీనివాస్ చిన్న పెట్టుబడితోని పెద్ద లక్ష్యం చేరాలనుకున్నడు. ఏడికెల్లో వచ్చినోళ్లంత బాగుపడతాంటె.. మనకేం తక్కువ?’ అనుకున్నడు. నారాయణఖేడ్ దగ్గరున్న బద్దారం నుంచి వచ్చి బాలానగర్ (హైదరారబాద్)ల దిగిండు. 2006లో రూ. 3 లక్షల పెట్టుబడితోని ‘సూర్య ఫ్యాబ్రికేటర్స్’ మొదలువెట్టిండు. ఇక్కడ ఎలక్ట్రిక్ వైర్లు ఉత్పత్తిచేసే మెషీన్ల తయారీకి అవసరమైన పనిముట్లు తయారు చేసేటోడు. కొత్త ఆర్డర్లు వస్తున్నకొద్ది మెషీన్లు కొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నడు. అప్పట్ల కంపెనీ జోర్దార్గ నడిచింది.
ఏడువారాల చీకట్లు!
అంతా బాగుందనుకుంటున్న సమయంలో కరెంట్ కష్టాలు మొదలైనయి. గవర్నమెంట్ ‘పవర్ హాలిడే’ అంటూ రోజుకో ఏరియాల కరెంటు బంద్ జేసుడు మొదలుపెట్టింది. సోమవారం బాలానగర్, మంగళవారం సనత్నగర్, బుధవారం జీడిమెట్ల.. ఇట్ల సిటీల ఉన్న ఏడు ఇండస్ట్రియల్ జోన్లలో వారానికో రోజు కరెంటు తీస్తున్నరు. మిగిలిన రోజులల్ల కూడ మధ్యాహ్నం కోత పెట్టేది. కరెంటు ఉన్నప్పుడే పనిజేసుడుతోని రోజుకు 12 గంటలు కంపెనీలనే గడిచిపోయేది. ఆదివారం కూడా పనిచేయాల్సి వచ్చేది. దీంతో పిల్లగాండ్లతో మాట్లాడే పరిస్థితి లేకుంట అయ్యింది. కరెంటు కష్టాలు కంపెనీ కూలన్నల్ని, ఓనర్లని ముప్ప తిప్పలు పెట్టినయ్.
అభివృద్ధికి హాలిడే
‘స్కూళ్లకు, కాలేజీలకు హాలిడే ఉంటది! కరెంటుకు హాలిడే ఏంటిది? అనుకున్నడు రాకేశ్ అగర్వాల్. కాలేజీ చదువులు అయిపోయి తండ్రి నడిపే జైపూర్ స్టీల్ ట్రేడర్స్ కంపెనీ చూసుకోనీకి కొత్తగా వ్యాపారంలోకి వచ్చిండు రాకేశ్. ఆర్డర్లు 40 శాతానికి పడిపోయినయ్. పని తగ్గినా కార్మికులకు జీతాలియ్యాల్సి వచ్చిందట. జీతం తగ్గిస్తే బతకలేక ఊళ్లకు పోతరు. అప్పుడు కంపెనీ మూయాల్సి వస్తది. ఎక్కువ నష్టం కంటే తక్కువ నష్టం మేలని చెప్పే వ్యాపార సూత్రం పాటించారట. కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు అన్నీ ఆగమాగం అయినయ్. తాండూరులో పాలిషింగ్ ఇండస్ట్రీ, ఖమ్మంలో గ్రానైట్ ఇండస్ట్రీ, సిరిసిల్లలో చేనేత పరిశ్రమ, హుజూరాబాద్, రామగుండం, మంథని, వరంగల్, కరీంనగర్ల కూడా ఇదే పరిస్థితి. ఎన్నో కంపెనీలు మూతబడ్డయ్. చానా కంపెనీలు నష్టపోయినయ్. వస్తమన్న కంపెనీలు వేరే రాష్ర్టాలకు పోయినయ్.
చీకటి రోజులు .. ఆకలి బాధలు
నష్టాలు భరించుకుంటనే శ్రీనివాస్ కంపెనీ నడిపిండు. మల్లయ్య పనిచేసే కంపెనీ జీతం తగ్గకుండా ఉండాల్నంటె ఎక్కువ గంటలు పని చేసి, కరెంటు లేని రోజు సెలవు తీసుకోవాలని చెప్పింది. జీతం తగ్గలేదు. కానీ ఇన్సెంటివ్స్ తగ్గేసరికి పిలగాండ్ల చదువులకు ఇబ్బందొచ్చింది. ఓనరు శ్రీనివాస్ కంపెనీ నడపనీకి ఎట్లయితే అప్పులు జేసిండో? ఇల్లు నడపనీకి మల్లయ్య కూడా అప్పులు జేసిండు. ఆ అప్పులు తీర్చనీకి బంగారం కుదువబెట్టిండు.
చీకట్లను చీల్చిన తెలంగాణ
పార్లమెంట్ల తెలంగాణ బిల్లు పాసైంది. ఎన్నికలొచ్చినయ్. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోల పరిశ్రమలకు కోతల్లేకుంట కరెంట్ ఇస్తమని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పరిశ్రమల్ని పోనియ్యమని కార్మికులకు హామీ ఇచ్చింది. వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీగా కరెంటు ఇస్తమని చెప్పింది. ఎన్ని అనుమానాలున్నా ‘కనురెప్పపాటు కరెంటు కోత’ ఉండదని కేసీఆర్ కుండబద్దలు కొట్టిండు. ‘ఇదంతా జోక్ అన్నోళ్లున్నరు! ఏడికెల్లి తెస్తడని నవ్విన్రు. నేను కూడా నమ్మలే’ అని గందె హరికృష్ణ గుర్తుచేసుకున్నడు. తర్వాత ఏం జరిగిందో అందరికీ ఎరుకనే! అవన్నీ అబద్ధాలై తెలంగాణ గెలుపొక్కటే నిజమైంది.
బతుకు సంబురం
అక్టోబరు 2014 నుంచి కరెంటు కోతలు ఎత్తివేస్తూ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. కంపెనీల కూలన్నలకు, ఓనర్లకు అందరికీ సంబురమొచ్చింది. జీడిమెట్ల, సనత్నగర్, ఈసీఐఎల్, మల్లాపూర్, నాచారం, ఆజామాబాద్, కుత్బుల్లాపూర్, సూరారం, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాల బోసిపోయిన రోడ్లన్నీ మళ్లీ కళకళలాడినయ్. ‘కావాల్సినంత కరెంటు, చేతినిండా పని. ఇంకేం కావాలె?’ అంటున్నడు శ్రీనివాస్. తెలంగాణ వచ్చినంక నష్టాల నుంచి లాభాల కొచ్చిండు. లాభాలొస్తుంటే అప్పులు తీర్చిండు. ఇప్పుడు కంపెనీ పెద్దది చేయాలనుకున్నడు.
అప్పులు తీరి..
కంపెనీ నడిపేటోళ్లు బాగుంటెనే కూలన్నలు బాగుంటరు కదా. గిప్పుడు మల్లన్న గూడ మస్త్ ఖుషీగ ఉన్నడు. పని పెరిగింది.. ఇన్సెంటివ్స్ పెరుగుతున్నయ్.. ఇంక్రిమెంట్లు వస్తున్నయ్. ‘గీ పైసలన్నీ ఏం జేస్తున్నవ్?’ అంటే.. ‘నాలుగేండ్లు చేసిన అప్పులు తీర్చనీకి మూడేండ్లు పట్టింది. ఇప్పుడు దాసుకుంటన్న. ఇద్దరు కొడుకుల్ని ఇంజినీరింగ్ సదివిచ్చిన. ఊర్ల ఇల్లు కట్టనీకి నెలనెలా 20వేలు చిట్టీలకే కడుతాన్న అన్నడు. గిదే లెక్కలు గవర్నమెంట్ ఏజెన్సీలు గూడ చెప్పినయ్. ఒక్క కంపెనీ ఈడ నుంచి పోలె. కొత్త కంపెనీలు ఈడికే వస్తున్నయ్. కంపెనీలు ఏటా పెరుగుతున్నయ్. కార్మికులు పెరుగుతున్నరు. మన జీడీపీ తెలంగాణ రాకముందు మైనస్ల ఉంటే ఇప్పుడు 15 శాతానికి వచ్చింది. ఇట్ల వెలిగిపోతాంది తెలంగాణ. చీకట్లో గుండె దిటవు చేసుకుని నిలబడ్డ శ్రీనివాస్ ఇప్పుడు కంపెనీని పెద్దది చేసిండు. బాలానగర్ల జాగ సరిపోతలేదని యూనిట్ని జీడిమెట్లకు మార్చిండు.
తెలంగాణ సంబురం కేసీఆర్
‘గిదంతా తెలంగాణ కోసం పోరాడితే దక్కిన ఫలితం’ అంటున్నడు మల్లయ్య. ‘కేసీఆర్ సార్ విజన్’ అంటున్నడు రాకేశ్ అగర్వాల్. ‘ఒక్క బిల్డింగ్ బూజు పట్టలె. ఒక్క కంపెనీ పోలె. ఉద్యోగం కావాల్నని ఆంధ్రా పోరగాండ్లు హైదరాబాద్కే వస్తున్నరు. అట్లుంటది మనతోని’ అంటున్నడు గందె హరి. తెలంగాణ ఇట్లనే ఉంటె మాలెక్కన ఇంకెంతో మంది బాగుపడుతరని శనార్తి పలుకుతున్నడు శ్రీనివాస్.