పాలకుర్తి రూరల్, ఫిబ్రవరి 26: మరో సేవాలాల్ మహరాజ్ సీఎం కేసీఆర్ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ గుడి, భవన నిర్మాణాలకు మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. మోదీ సర్కారు గిరిజన వ్యతిరేకి అని, వారికి రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
సీఎం కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచితే కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు రిజర్వేషన్లు అవసరమా? అని బీజేపీకి చెందిన ఎంపీ మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. జనాభా ప్రాతిపదికన కేంద్రం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లుగా కేంద్రం గిరిజన రిజర్వేషన్లు పెంచకపోవడంతోపాటు మరో 200ర కులాలు, ఉప కులాలను గిరిజనుల్లో కలిపారని మండిపడ్డారు.
దేశంలో కోటి మంది మాట్లాడే కొంకిలి భాషకు లిపి ఉన్నదని, 15 కోట్ల మంది గిరిజనులు మాట్లాడే లంబాడీ భాషకు లిపి లేకపోవడం బాధాకరమన్నారు. గిరిజనులపై బీజేపీకి ప్రేమ ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో బంజారా భవన్, సేవాలాల్ మహరాజ్ గుడి నిర్మించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని కొనియాడారు.
గిరిజనుల అభివృద్ధి పట్టని కేంద్రం
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నరేంద్రమోదీ సర్కారు గిరిజన వ్యతిరేకి అని మండిపడ్డారు. అసెంబ్లీలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రం గిరిజన రిజర్వేషన్లు పెంచకుండా అడ్డుపడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ కవిత, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు పాల్గొన్నారు.