హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-44లో భాగం) నందనవనంగా మారింది. మెదక్ నుంచి ఆదిలాబాద్ చివరి వరకు పచ్చదనం సంతరించుకున్నది. పచ్చదనం పెంపుదలలో భాగంగా ఆదిలాబాద్ హైవేను మరింత సుందరీకరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ పనులు పూర్తి చేసింది. హైదరాబాద్ శివారులతోపాటు, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో 258 కిలోమీటర్ల పొడవునా.. 1,50,130 మొక్కలను రహదారికి ఇరువైపులా నాటారు. గతంలో హైవే నిర్మాణ సమయంలో నాటినవి, ప్రస్తుతం ఉన్నవి కాకుండా మొత్తం రహదారి వనాలతో కవర్ అయ్యేలా ఈ ప్లాంటేషన్ జరిగింది. పెద్దసైజు మొక్కలను నాటడంతోపాటు, వాటికి తగిన రక్షణ చర్యలు, నీటి సౌకర్యం అందేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ పేర్కొన్నారు. హైవే వెంట నీడతోపాటు, రంగురంగుల పూలతో ఆహ్లాదాన్ని పంచేలా మొక్కలను నాటారు. గుల్మొహర్, పెల్టోఫారమ్, తబూబియా, బహునియా, జకరండా, అడవిబాదం, ఆకాశమల్లె, స్పతోడియా, నేరేడు, చింత, కదంబ, రావి, మర్రి మొదలైన మొక్కలను అటవీశాఖ నాటింది.