హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో జరుగుతున్న అక్రమాలపై రవాణాశాఖ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు, అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన తీవ్రమైన అవకతవకల నేపథ్యంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఎం చంద్రశేఖర్గౌడ్ సోమవారం పలు ఆదేశాలు ఇచ్చారు.
డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు జారీ చేయడం, దరఖాస్తుదారుడు లేకుండానే లైసెన్స్ మంజూరు చేయడం, ప్రైవేట్ ఏజెంట్లతో కుమ్మకవడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.