హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ప్రసార వ్యవస్థలో నష్టాలు (ట్రాన్స్మిషన్ లాసెస్) ఆందోళన కలిగిస్తున్నాయి. నెలకు సగటున 2% చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 140-200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు నష్టం సంభవించింది. ఈ ఏడాది మార్చిలో ఈ నష్టం ఏకంగా 201 మిలియన్ యూనిట్లకు చేరింది. 2025 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన ట్రాన్స్మిషన్ నష్టాలు స్థిరంగా లేవు. కొన్ని నెలల్లో నష్టం తగ్గినప్పటికీ మరికొన్ని నెలల్లో మళ్లీ పెరిగింది. నిరుడు నవంబర్లో ట్రాన్స్మిషన్ నష్టాలు 2.08 శాతంగా నమోదయ్యాయి. డిసెంబర్లో 2.11, ఈ ఏడాది జనవరిలో 2.12, ఫిబ్రవరిలో 2.26 శాతానికి పెరిగాయి. మార్చిలో ఈ నష్టం స్వల్పంగా తగ్గి 2.14 శాతంగా నమోదైంది.
ఉత్పత్తి చేసిన లేదా కొనుగోలు చేసిన విద్యుత్తుకు బిల్లింగ్ చేసిన విద్యుత్తుకు మధ్య ఉండే వ్యత్యాసాన్నే ట్రాన్స్మిషన్ లాస్గా పరిగణిస్తారు. తీగల్లో విద్యుత్తు ప్రవహించినప్పుడు వేడి, ఇతర శక్తి రూపాల్లో వృథా అయ్యే విద్యుత్తును ప్రసార నష్టంగా పేర్కొంటారు. ఈ ఏడాది ఏప్రిల్లో 2.30 శాతంగా ఉన్న నష్టం.. మే నెలలో 2.20 శాతానికి, జూన్లో 2.08 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ ఈ నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నందున ప్రసార వ్యవస్థ సామర్థ్యం, గ్రిడ్ నిర్వహణ, సబ్స్టేషన్ల పనితీరు, లైన్ల సామర్థ్యం లాంటి అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
