హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ శుక్రవారం హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరంతా మే 4వ తేదీలోగా తమ బాధ్యతలను కొత్తగా నియమితులైన వారికి అప్పగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్ విభాగం) ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ కేసులు విచారించే జడ్జి బీఆర్ మధుసూదన్రావు వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా బదిలీ అయ్యారు.
కామారెడ్డి 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న సీహెచ్ రమేశ్బాబు సీబీఐ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా చేస్తున్న సీహెచ్కే భూపతిని రంగారెడ్డి జిల్లా జడ్జిగా పంపారు. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్న తిరుమలదేవిని జ్యుడిషియల్ అకాడమీకి, సంగారెడ్డి జిల్లా జడ్జి పాపిరెడ్డిని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాల కేసులను సీబీఐ కోర్టు జడ్జి మధుసూదనరావు విచారణ చేస్తున్న తరుణంలో ఆయన బదిలీతో ఆ కేసు విచారణ జాప్యం అవుతుందనే చర్చ జరుగుతున్నది.