హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు సురక్ష దినోత్సవాన్ని (Suraksha dinotsavam) నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ (Foot Patrolling), బ్లూకోట్స్ ర్యాలీ నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ ఐసీసీసీ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.
ఆదివారం రాత్రి 9 గంటలకు బంజారాహిల్స్లోని ఐసీసీసీ నుంచి ప్రారంభమయ్యే ఫుట్ పెట్రోలింగ్ ఒరిస్సా ఇజ్లాండ్, సీవీఆర్/బీవీబీ జంక్షన్, జర్నలిస్టు కాలనీ, రోడ్ నం.45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా ఒరిస్సా ఇజ్లాండ్ వరకు ఫుట్ పెట్రోలింగ్ సాగుతుంది. కవాతు సమయంలో అంటే ఆదివారం రాత్రి 9 గంటల నుంచి ర్యాలీ ముగిసే వరకు పైన పేర్కొన్న జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను నిలిపివేయనున్నారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే 9010 203 626 నంబర్ను సంప్రదించాలని సూచించారు.