చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో ఫ్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది.. పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం దండుమల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది.
హామీ ఇచ్చి ఆరేండ్లు పూర్తవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో ఆ స్థలం వృథాగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్థలంలో జేపీ నడ్డాకు సమాధి కట్టి తమ నిరసన తెలియజేశారు.