Sarala Kumari | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన సీనియర్ నటి, కూచిపూడి డ్యాన్సర్ సరళకుమారి సురక్షితంగా ఉన్నట్టు ఆమె కుమార్తె నబిత శనివారం పేర్కొన్నారు. ‘లాచెన్’ ప్రాంతంలో తన తల్లి క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందిందని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ అంజనీకుమార్ స్పందించి తమ తల్లిని క్షేమంగా తెలంగాణకు తీసుకువచ్చేలా సాయం చేయాలని వేడుకొన్నారు.
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నివాసం ఉంటున్న సరళకుమారి 2న హైదరాబాద్ నుంచి తన స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. అనుకోకుండా అక్కడ భారీ వరదలు సంభవించడంతో శనివారం వరకూ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత తల్లిజాడ తెలుసుకొన్నారు. ఆమె సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 1983లో మిస్ ఏపీగా ఎంపికైన సరళకుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దానవీరశూరకర్ణ, సంఘర్షణ వంటి సినిమాల్లో నటించారు.