• ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని పిలుపు
• బిగ్బాస్ హౌస్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మొక్క
• కోట్ల మొక్కలు నాటిన సంతోష్కుమార్కు బిగ్బాస్ అభినందనలు
BigBoss-5 | తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్-5 కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ నినాదం మార్మోగింది. ప్రతిభావంతులైన నటులు, వారి ప్రజ్ఞాపాటవాలకు ముగ్ధులవుతున్న కోట్ల మంది ప్రజలకు మంచి సందేశం ఇవ్వడానికే బిగ్బాస్-5 కార్యక్రమంలో గ్రీన్ఇండియా చాలెంజ్ను భాగం చేశారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథం అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి ఎకరాల రిజర్వు ఫారెస్ట్ దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ను నాగార్జున సాదరంగా ఆహ్వానించారు. నాలుగైదేండ్లుగా, మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకొని కోట్ల మొక్కలు నాటారు.. నిజంగా మీ కృషికి హ్యాట్సఫ్ సర్ అంటూ జోగినిపల్లి సంతోష్ కుమార్ను అభినందించారు.
ఆదివారం జరిగిన బిగ్బాస్-5 కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కు, నటుడు నాగార్జున మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పటివరకు మూడు కోట్ల మొక్కలు నాటారా.. అని నాగార్జున అడిగారు. దీనిపై ఎంపీ సంతోష్ కుమార్ చిరునవ్వుతో స్పందిస్తూ 16 కోట్ల మొక్కలు నాటామని బదులిచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలి.. వాటిని కాపాడాలనే ఆలోచనను కలిగించడానికి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం చేపట్టాం. ఒకచోట ఒకరు ఒకటి, రెండు మొక్కలు నాటారు, మరోచోట టీంలుగా కొంతమంది కలిసి మొక్కలు నాటారు. ఇక స్టార్లు, సెలెబ్రెటీలు ఫారెస్ట్లను దత్తత తీసుకున్నారు. ప్రభాస్ 1643 ఎకరాలు, హెటిర్ డ్రగ్స్ పార్ధసారథి రెడ్డి 2500 ఎకరాల అడవులను దత్తత తీసుకొని మొక్కల్ని పెంచుతున్నారు. మేం నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటాం.. మా ఈ ప్రయత్నం ఈ రోజు మీ ద్వారా కోట్లమందికి చేరింది అని చెప్పారు. ఇంత అద్భుతమైన షోలో తమ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జునకు, స్టార్ మా కు, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్స్ కి, టెక్నిషీయన్లకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నాగార్జున మాట్లాడుతూ ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా 3 వారాల సమయం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ 3 వారాలు.. వారానికొకటి చొప్పున 3 మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక మనిషి తన ఆలోచనతో ప్రకృతి బాగుండాలన్న తపనతో కోట్లమొక్కలు నాటితే.. బిగ్బాస్ హౌస్ పిలుపుతో ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోవాలన్నారు. భూతాపాన్ని నివారించి, భూమిపై భవిష్యత్ తరాలు మనుగడ సాగించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గం అన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”, వారి మాటలు, స్పూర్తి నన్నెంతగానో కదిలించాయి. తానూ ఎంపీ చూపిన చోట రిజర్వు ఫారెస్ట్ను దత్తత తీసుకొని పెంచుతాను.. సమాజం పట్ల నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను. జోగినిపల్లి సంతోష్ కుమార్ అందించిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటి వారి స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు.