Liquor Shop Tenders | హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్లు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగనున్నది. మండలాలు, దుకాణాల ప్రాతిపదికన బహిరంగంగా డ్రా తీయనున్నారు. మొత్తం 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో వచ్చిన పేర్లు వెంటనే ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ అమ్మకాలు, గుడుంబా, సొంత లేబుళ్ల ద్వారా తయారుచేసే నకిలీ మద్యం, ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ఎక్సైజ్ టెండ ర్ల లకీడ్రా ఏర్పాట్లపై మహబూబ్నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం అన్ని జిల్లాల్లో వీడియో చిత్రీకరణ మధ్య కలెక్టర్ల సమక్షంలో లకీడ్రా నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు అలాట్మెంట్ ఆర్డర్లు అధికారులు వెంటనే అందిస్తారని వెల్లడించారు. లైసెన్స్దారులు, ఎంట్రీ పాస్ ఉన్నవారికే డ్రా నిర్వహించే ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.